ఐప్యాక్ సహ వ్యవస్థాపకుడు వినేశ్ కు బెయిల్
- పశ్చిమ బెంగాల్ బొగ్గు కుంభకోణంలో వినేశ్ పై మనీలాండరింగ్ ఆరోపణలు
- బెయిల్ మంజూరు చేసిన పాటియాలా హౌస్ కోర్టు
- కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని షరతు
రాజకీయ, ఎన్నికల వ్యూహాల సంస్థ ఐ-ప్యాక్ (I-PAC) సహ వ్యవస్థాపకుడు వినేశ్ చందల్కు ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో ఊరట లభించింది. పశ్చిమ బెంగాల్లో సంచలనం సృష్టించిన బొగ్గు కుంభకోణం కేసులో తలెత్తిన మనీలాండరింగ్ ఆరోపణల కేసులో ఆయనకు కోర్టు ఉపశమనాన్ని కల్పించింది. వినేశ్ చందల్కు అదనపు సెషన్స్ జడ్జి అమిత్ బన్సాల్ బెయిల్ మంజూరు చేశారు. విచారణలో ఆయన సహకరించారని ఈడీ పేర్కొనడంతో, బెయిల్ ఇచ్చేందుకు కోర్టు మొగ్గు చూపింది.
వినేశ్ చందల్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 2 లక్షల వ్యక్తిగత పూచీకత్తు, ష్యూరిటీ సమర్పించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని, సాక్ష్యాలను ధ్వంసం చేయరాదని, భవిష్యత్తులో జరిగే దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలని కోర్టు షరతులు విధించింది.
నేషనల్ లా ఇన్స్టిట్యూట్ యూనివర్శిటీ గ్రాడ్యుయేట్ అయిన వినేశ్ చందల్కు ఐ-ప్యాక్లో 33 శాతం వాటా ఉంది. ఈ సంస్థ గతంలో పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. మరోవైపు, బొగ్గు కుంభకోణం కేసులో ఈనెల 23న ఆయనను 14 రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. తాజా విచారణ అనంతరం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. సీనియర్ అడ్వకేట్ వికాస్ పహ్వా, అభిషేక్ మిశ్రా ఆయన తరపున వాదనలు వినిపించారు.